కృష్ణం వన్దే జగద్గురుమ్ – ౬

జూన్ 6, 2008

శ్రీమద్భాగవతములోని కథ

(ఈ కథ యొక్క ఉత్తర భాగము)

(PDF)

శ్రీకృష్ణుడు గోపబాలురతో కలిసి వింతవింత ఆటలాడి చూసే వారికి కన్నులపండుగ చేసెడివాడు. కన్నయ్య దేహానికి అంటిన దుమ్ము భూతిభూషణుడు ప్రీతితో అలంకరించుకొను విభూతి వలె కనిపించెడిది. ఉంగరాలజుట్టు పై యశోద అలంకరించిన ముత్యాలమాల ఇందుశేఖరుడు తలదాల్చిన చంద్రుని పోలి ఉండెడిది. నుడుటి మీది ఎఱ్ఱని కస్తూరి తిలకం “కామారి మూడవ నేత్రమా?” అన్నట్లు ఉండెడిది. రత్నాలహారం లోని నీలమణి గరళకంఠుని కృపావృష్టికి నిదర్శనమైన హాలాహలపు మచ్చవలె శోభిల్లెడిది. మెడలోని ముత్యాలహారాలు నాగభూషణుని అలంకరించు సర్పహారాల వలెనుండెడివి. సామవేదసారుడైన కృష్ణస్వామి వేణువు ఖట్వాంగుని దణ్డమును పోలి ఉండెడిది. ఇలా “శివుడూ నేనూ ఒకటేసుమా!” అని హెచ్చరిస్తున్నాడా? అన్నట్టు కనిపించేవాడు బాలకృష్ణుడు.

ఒకనాడు శ్రీకృష్ణుడు ఆటలమధ్యలో ఒక గోపిక ఇంటిలోకి జొరపడి కడవలలోని నేతినంతా త్రాగివేశాడు! అంతేకాక ఖాళీ కడవలను తీసుకువచ్చి ప్రక్క ఇంటిలో పడవేసి వెళ్ళిపోయాడు. తరువాత ఆ ఇంటివారికీ ఈ ఇంటివారికీ పెద్దపోట్లాట జరిగింది. ఈ అల్లరి వివరిస్తూ గోపిక యశోదతో ఇలా అన్నది:

వా రిల్లు సొచ్చి కడవలఁ
దోరంబగు నెయ్యి ద్రావి తుది నా కడవల్
వీరింట నీ సుతుం డిడ
వారికి వీరికిని దొడ్డవా దయ్యె సతీ!

పిల్లలూ! మరి జగద్గురువైన శ్రీ కృష్ణుడు ఈ కథ ద్వారా ఏమి బోధించాలనుకున్నాడో తెలుసుకుందామా?
నెయ్యి జ్ఞానానికి సంకేతము. జ్ఞానాన్ని వస్తు రూపములో భద్రపఱచిన (కడవలలో నెయ్యి ఉంచిన) గోపిక నిజానికి జ్ఞానమును ఆర్జించుకోలేదు. దీనికి నిదర్శనం నిజానిజాలు తెలుసుకోకుండా ప్రక్క ఇంటివారితో పోట్లాడడమే. కృష్ణస్వామి నేతిని త్రాగివేసి జ్ఞానమునెన్నడు స్వార్థముతో దాచుకోరాదు (దాచుకోలేరు) అని చూపించినాడు. అంతే కాక ఆర్జించిన జ్ఞానమును ఇతరులకు పంచాలని చూపించడానికి కడవలను ప్రక్క ఇంటిలో పడవేశాడు. ఐతే జ్ఞానము స్వానుభవైకవేద్యమైనది కావున జ్ఞానమును పదార్థ రూపములో (నేతి రూపములో) పంచలేము. జ్ఞానబోధకు ఏకైకమార్గం జ్ఞానార్జన పై జిజ్ఞాస కలిగించడం. అందుకనే శుద్ధజ్ఞాన పరాత్పరుడైన శ్రీకృష్ణుడు కమ్మని నేతివాసనలు వచ్చే ఖాళీ కడవలను ప్రక్క ఇంటిలో పడవేశాడు.

కాబట్టి జగద్గురువైన శ్రీ కృష్ణుడు ఈ కథ ద్వారా మనకు జ్ఞానమెన్నడూ స్వార్థబుద్ధితో దాచుకోరాదని, దానిపై జిజ్ఞాస కలిగే రీతిలో అందఱికీ అందించాలని బోధించినాడు. అంతేకాక జ్ఞానమును సంపూర్ణముగా ఆస్వాదించి గురుత్వమును పొందిన తరువాతనే ఇతరులకు బోధించాలి అని శ్రీ కృష్ణ పరమాత్మ ఈ కథ ద్వారా చూపినాడు. అందుకనే నెయ్యి మొత్తం త్రాగివేసి (గురుత్వమును సంపాదించిన) తరువాతనే ప్రక్క ఇంటిలో కడవలను పడవేసి జ్ఞానబోధ చేసినాడు.


కృష్ణం వన్దే జగద్గురుమ్ – ౫

మే 5, 2008

శ్రీమద్భాగవతములోని కథ

(ఈ కథ యొక్క ఉత్తర భాగము)

(PDF)

చిన్నికృష్ణుడు గోపబాలురతో కలిసి ఎన్నో విచిత్రమైన ఆటలు ఆడేవాడు. “మీరందఱూ గోవులు నేను ఆబోతును” అంటూ ఆబోతులాగా రంకెలు వేస్తూ పరుగులెట్టేవాడు. “నేను రాజును మీరు భటులు” అంటూ అధికారం చూపుతూ వారికెన్నో పనులు చెప్పి చేయిస్తూ ఉండేవాడు. మూలమూలలా దాక్కొని దాగుడుమూతలాడే వాడు. అందఱితో కలిసి ఉయ్యాలాటలు, చేబంతులాటలు ఆడేవాడు. ఆహా! కఠోర నిష్ఠాపరులైన సంయమీద్రులకు సైతం అందని పరంధాముడు గోపబాలురతో కలిసి ఆటలాడుటకు వారెంత పుణ్యము చేసినారో!

ఒకరోజు కన్నయ్య ఆటకని బయలుదేరాడు. ఒకానొక గోపిక ఇంటిలోనికి వెళ్ళాడు. ఆ ఇంటి కోడలు నిద్రపోతూ ఉన్నది. బాలకృష్ణుడు వాళ్ళ ఇంట్లో ఉన్న పెరుగంతా త్రాగివేశాడు. వెళ్ళేవాడు వెళ్ళకుండా నిద్రిస్తున్న ఆ కోడలి మూతికి కొంచెం పెరుగు వ్రాసి వెళ్ళిపోయాడు. పెరుగంతా తానే తినివేసిందని భ్రమసి అత్తగారు కోడలిని కొట్టింది. ఆ అల్లరిపని లోని ఆంతర్యం గ్రహించలేక యశోదతో శ్రీకృష్ణుని గురించి ఇలా చెప్పుకుంది ఓ గొపిక

ఆడం జని వీరల పెరుఁ
గోడక నీ సుతుఁడు ద్రావి యొకయించుక తాఁ
గోడలి మూఁతిం జరిమినఁ
గోడలు మ్రుచ్చనుచు నత్త గొట్టె లతాంగీ!

పిల్లలూ! మరి జగద్గురువైన శ్రీ కృష్ణుడు ఈ కథ ద్వారా ఏమి బోధించాలనుకున్నాడో తెలుసుకుందామా?
ఈ సన్నివేశము జరిగిన సమయం రాత్రి కాదు. పైగా అది శ్రీకృష్ణుడు ఆటకై బయలుదేరిన సమయం కాబట్టి మనుషులు బాగా మేల్కొని ఉండి శ్రమించి తమ కర్తవ్యాలు నిర్వహించ వలసిన సమయం. అట్టి ఉపయోగకరమైన వేళలో ఆ ఇంటి కోడలు నిద్రించుట కృష్ణపరమాత్మకు నచ్చలేదు. అందుకనే ఆ విధంగా కోడలిని శిక్షించినాడు. ప్రకృతి నియమానుసరముగా లభ్యమైన సమయమును వృధా చేయకుండా నిరంతరం సత్కర్మలను చేయాలన్నదే జగద్గురువైన శ్రీకృష్ణుని సందేశం.


కృష్ణం వన్దే జగద్గురుమ్ – ౩

మే 3, 2008

శ్రీమద్భాగవతములోని కథ

(ఈ కథ యొక్క ఉత్తరభాగము)

(PDF)

శ్రీకృష్ణుడు బాలురందఱిలోనూ చాలా ఉత్తముడు. ఆతని బాల్యక్రీడలు లోకహితార్థములైన మహోపదేశాలే కాని అల్లరి పనులు కావు. విష్ణుమాయచే మోహితులైన గోపికలు శ్రీకృష్ణుడు ఒక బాలుడని భ్రమించినారే కానీ ఆదిమధ్యాంతరహితుడైన పరబ్రహ్మ అని తెలుసుకోలేక పోయారు. ఆతని అల్లరి పనులు నిజమేనని నమ్మారు. చిన్నికృష్ణుని దుండగాలు సహించలేని ఒక గోపిక యశోదతో ఇలా మొఱబెట్టుకున్నది

మీ పాపఁడు మా గృహముల
నా పోవఁగ బాలు ద్రావ నగపడ కున్నం
గోపించి పిన్నపడుచుల
వాపోవఁగఁ జిమ్ముకొనుచు వచ్చెం దల్లీ!

“ఓ తల్లీ! యశోదా! మీ పిల్లవాడు మా గృహములోకి వచ్చి తనకు తృప్తిదీరా త్రాగుటకు సరిపోవు పాలు లేవని కోపించినాడు. పసిబిడ్డలని కూడా చూడకుండా కోపముతో వారిని పడదోసుకుంటూ బయటికి వచ్చేశాడు. వాళ్ళు పాపం గుక్కపట్టి ఏడ్చారు. అమ్మా! నీవూ ఒక తల్లివే కదా? మా బాధను అర్థంచేసుకోలేవా?”.

పిల్లలూ! మరి జగద్గురువైన శ్రీ కృష్ణుడు ఈ కథ ద్వారా ఏమి బోధించాలనుకున్నాడో తెలుసుకుందామా?
గృహస్థధర్మాలలో అతి ముఖ్యమైన అంశం గురించి శ్రీకృష్ణ గురువర్యుడు మనకీ కథలో బోధించినాడు. గృహస్థులు తమ పిల్లలను సంసారమును పోషించుకొనుటే కాక ఇంటికి వచ్చిన వారిని ముఖ్యముగా పిల్లలను వృద్ధులను అతిథులను అర్థులను సంతృప్తి పఱచవలెను. అట్లుచేయకుండిన వంశక్షయము కలుగునని శ్రీకృష్ణ గురుదేవుని సందేశము. చిన్న పిల్లవాడైన తనకు కావలిసినవి పాలు. ఆ ఇంటి యజమాని తన పిల్లలకు పాలు ఉన్నాయో లేవో చూచుకున్నాడు కానీ తన ఇంటికి ఆడుకొనుటకు వచ్చే భగవత్స్వరూపులైన బాలకులకు పాలు ఉన్నాయోలేవో చూసుకొనలేదు. అందుకనే కన్నయ్య వారినారీతిలో శిక్షించి కాపాడినాడు.

ఈ కారణముగనే మన పెద్దలు ముఖ్య అవసర వస్తువులైన ధాన్యం పసుపు-కుంకుమ పాలు-పెరుగులు ఎప్పుడూ ఇంట్లో లేకుండా ఉండకూడదని అంటారు. ఒకవేళ అవి లేకపోతే “నిండుకున్నాయి” అని అంటారే తప్ప “లేవు” అని అనరు. అట్టి వస్తువులను త్వరగా సంపాదించి తమ అవసరాలకోసమే కాక ఇంటికి వచ్చిన అర్థులకోసం కూడా ఉంచుకోవాలన్నదే వారి తాత్పర్యం. పూర్వం ఏ మాదాకబళం వాడు వస్తాడో ఏమో అని కొంచం అన్నం మిగిల్చేవారు. ఎప్పుడూ తినే పదార్థాలను పూర్తిగా వినియోగించుకునేవారు కాదు. అట్లా చేయుట వలన అనుకోకుండా వచ్చే అర్థులను కూడా తృప్తి పఱచవచ్చని వారి ఆలోచన. కాబట్టి మనమెన్నడూ అత్యవసర పదార్థాలను అర్థులకోసం దాచి ఉంచుకోవాలని జగద్గురువైన శ్రీకృష్ణుని సందేశం.


కృష్ణం వన్దే జగద్గురుమ్ – ౨

మే 3, 2008

శ్రీమద్భాగవతములోని కథ

(ఈ కథ యొక్క ఉత్తరభాగము)

(PDF)

ఒకనాడు బాలకృష్ణుడు గోపబాలురతో కూడి ఆటలాడుచుండెను. “మీరందఱూ వేషధారులు నేను సూత్రధారిని” అంటూ వారితో వింత ఆటలాడేవాడు చిన్నికృష్ణుడు. ఆటలమధ్యలో ఉండగా వారికి కమ్మని కాగిన పాల వాసనలు వచ్చినవి. వారు ఆ వాసనలు వచ్చుచున్న ఇంటిలోకి వెళ్ళారు. అక్కడ వారికి ఎన్నో కడవలనిండా మంచిగా కాగిన కమ్మని పాలు కనిపించాయి. అఖిలలోక వసుప్రదాత అయిన కృష్ణస్వామి కడవలలోని పాలను తన తోడిపిల్లలకు పంచివేశాడు. అంతటితో ఆగకుండా ఖాళీ అయిన కడవలను కూడా పగులగొట్టి వేశాడు.

కన్నయ్య చేతలోని ఆంతర్యం గ్రహించలేక పాపం ఆ ఇంటి పడుచు యశోదతో శ్రీకృష్ణుని దుడుకుపని వివరించి “ఓ పడతీ! నీ బిడ్డడు మా ఇంట ఇటువంటి అల్లరి చేశాడు. అసలు మీ వాడికి భయభక్తులు ఉన్నాయా?” అని వాబోయింది. ఆ లీలామానుషవిగ్రహుని అర్థం చేసుకొనుట ఎవరి తఱం ?

పడఁతీ! నీ బిడ్డఁడు మా
కడవలలో నున్న మంచి కాఁగిన పా లా
పడుచులకుఁ బోసి చిక్కిన
కడవలఁ బో నడిచె నాజ్ఞ గలదో లేదో?

పిల్లలూ! మరి జగద్గురువైన శ్రీ కృష్ణుడు ఈ కథ ద్వారా ఏమి బోధించాలనుకున్నాడో తెలుసుకుందామా?
“పాలు” అనే శబ్దము పంచుకోదగిన పదార్థమునకు సంకేతము. అందుకనే మన తేనెల తెలుగు భాషలో “పాలుపంచుకొనుట” అనే ప్రయోగం ఉన్నది. నలుగురికీ ఉపయోగపడే పదార్థమును పంచుకోకుండా తమకోసమే నిలువ చేసుకోరాదని శ్రీ కృష్ణ జగద్గురువు మనకీ కథ ద్వారా బోధించాడు. అందుకనే మిగిలిన కడవలను కూడా పగులగొట్టి పంచుకో తగినవి నిలవచేసుకోనీయకుండా చేశాడు. మీ-మా అనుభేదాలు మఱచి తోటి జనులతో సహజీవనము చేయమన్నదే ఆ సర్వేశ్వరుని సందేశం.


కృష్ణం వన్దే జగద్గురుమ్ – ౧

మే 1, 2008

(PDF)

శ్రీమద్భాగవతము లోని కథ

భారతీయుల పాలి పెన్నిధి అయిన గీతామృతాన్ని అందించిన శ్రీ కృష్ణ పరమాత్మ ఇప్పుడే “అమ్మా” అనటం నేర్చుకుంటున్నాడు. వామనునిగా భూమ్యాకాశాలను రెండడుగులతో కొలిచిన నల్లనయ్య ఇప్పుడే తప్పటడుగులు వేయడం నేర్చుకుంటున్నాడు. దిన దినాభివృద్ధిగా తల్లితండ్రులకు ఆనందం కలిగిస్తూ పెరుగుతున్నాడు.

బాలకృష్ణుడు గోపబాలురతో కలిసి ఎన్నో అల్లరి ఆటలాడేవాడు. లీలామానుష విగ్రహుడైన ఆ కన్నయ్య అల్లరి నిజమని నమ్మారు గోపికలు. చిన్ని కృష్ణుడు చేసే వినోదాలు తమయెడల అనుగ్రహించిన మహాప్రసాదాలని మహోపదేశాలని పాపం వారు తెలుసుకోలేక పోయారు. యోగీశ్వరేశ్వరుడైన కృష్ణుని తత్త్వం తెలుసుకొనుట ఎవఱి తఱము ?

కన్నయ్య అల్లరి పనులకు ఓర్పు నశించిన గోపిక ఇలా యశోదతో మొఱబెట్టుకున్నది “అమ్మా! యశోదా! నీ పాపని అల్లరిని ఏమని చెప్పేది? మా యింటిలోని బాలింతలకు పాపం పసి పాపలకు ఇవ్వడనికి పాలులేవు. ఆకలితో గుక్కపట్టి ఏడుస్తున్న పాపలకి గోక్షీరమైనా పడదామని అనుకున్నారు. ఇంతలో మీ పాపడు వచ్చి బాలింతల మొఱలు వినకుండా లేగదూడల త్రాళ్ళు విప్పి ఆవుల వద్ద వదిలేశాడు. అవి ఆవుల పాలు త్రాగివేశాయి. పిల్లలకు పాలు ఇవ్వలేక పోయిన ఆ బాలింతల దుఃఖం వర్ణనాతీతం. ఇది ఏమైనా న్యాయమా? ఓ అంభోజాక్షీ! చెప్పవమ్మ!”.

బాలురకుఁ బాలు లే వని
బాలెంతలు మొఱలు వెట్టఁ బకపక నగి యీ
బాలుం డాలము సేయుచు
నాలకుఁ గ్రేపులను విడిచె నంభోజాక్షీ!

పిల్లలూ! మరి జగద్గురువైన శ్రీ కృష్ణుడు ఈ కథ ద్వారా ఏమి బోధించాలనుకున్నాడో తెలుసుకుందామా?
పిల్లలకు పాలు లేకపోతే మనం ఎంత బాధపడతామో లేగదూడలకు పాలుపట్టినీయకుండా పాలుపిండుకుంటే ఆవులు కూడా అంతే బాధను అనుభవిస్తాయి. సర్వాంతర్యామి అయిన బాలకృష్ణుడు పశుపక్షాదుల బాధలను అర్థం చేసుకొని వాటిని బాధించకుండా వాటితో సహజీవనము చేయాలని మనకు ఈ కథ ద్వారా బోధించినాడు. ఆవులు దూడలకు పాలు ఇచ్చిన తరువాతే మనం మిగిలిన పాలు తీసుకోవాలన్నదే జగద్గురువైన కృష్ణుని ఆంతర్యం (ఈ ధర్మాన్ని పాటించిన దిలీపుని కథ కూడా చదవండి). పశుపక్షాదులను సైతం ప్రేమించి అహింసాయుత జీవనాన్ని లోకానికి బోధించిన భరతభూమి ధన్యభూమి.


తొండమాన్ చక్రవర్తి – భీమ కులాలుడు

డిసెంబర్ 30, 2006

(tondaman.pdf)

భవిష్యోత్తర పురాణము లోని కథ

కలియుగ ప్రత్యక్ష దేవుడైన శ్రీ వేంకటనాథునికి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి అయిన పద్మావతీ దేవిని కన్యాదానమిచ్చిన మహానుభావుడు తొండమండలాధీశుడైన ఆకాశరాజు. తొండమానుడు ఆకాశరాజు సోదరుడు. అమిత శ్రీనివాస భక్తుడు. స్వామి ఆజ్ఞపై తిరుమల భవ్య మందిర నిర్మాణము చేయించిన ధన్యజీవి. బ్రహ్మాది దేవతలు నిత్యం వచ్చి శ్రీవేంకటపతిని సేవించుకునేది తొండమానుడు కట్టించిన ఆలయంలోనే. తొండమానుడు ఎంతటి భక్తుడంటే నిత్యము స్వామితో సంభషణలు చేసేవాడు!

ఇలా ఉండగా ఒకరోజు ఆకాశవాణి “ఆహా! ఎంత పుణ్యం చేసుకున్నావయ్యా! శ్రీనివాసుని ప్రతి కైంకర్యుము నీచేతుల మీదిగా శ్రద్ధాభక్తులతో రంగ రంగ వైభవంగా చేయిస్తున్నావు. రాజా! నీవంటి విష్ణుభక్తుడు లేడయ్యా” అని అన్నది. అంతవరకూ స్వామిగురించి తప్ప ఏమీ ఆలోచించని తొండమానుడు “ఆకాశవాణి మాటలు నిజమే కదా! నావంటి భక్తుడు అరుదు” అని అనుకున్నాడు.

ఆహా! అహంకారమెంత దారుణమైనది. చివరికి మహనీయుడైన తొండమానుని సైతం విడువలేదు! అహంకారమే సకల దురుతాలకు మూలము. అహంకారం గర్వం ఎంత కొంచమైనా అది ఉన్నవాడిని నిలువునా దహించివేస్తుంది. కానీ స్వామి సామాన్యుడా? ఒక్కసారి త్రికరణశుద్ధిగా శరణువేడిన పరమ శత్రువునైనా దరిజేరుస్తాడు (ధర్మజ్ఞః కథ చూడండి). అలాంటిది సర్వసుగుణవంతుడు మహాభక్తుడు అయిన తొండమానుని పతనం జరగనిస్తాడా? లేదు. వెంటనే తొండమానునికి గుణపాఠం నేర్పాలని నిశ్చయించుకున్నాడు స్వామి.

ఒకరోజు తొండమానుడు స్వామితో సంభాషించుచూ “నావంటి భక్తుడు ఈ ముజ్జగాలలో లేడు. అసలు నేను తప్ప నీకు నిజభక్తులు ఎవరైనా ఉన్నారా దేవాదిదేవా?” అని ప్రశ్నించాడు. జగన్నాటకసూత్రధారి అప్పటికి చిరుమందహాసముతో సమాధానమిచ్చిఆ తొండమానునికి గుణపాఠం చెప్పే నాటకానికి అప్పుడే శ్రీకారం చుట్టాడు.

ఒకరోజు తొండమానుడు రోజూలానే ఉదయాన్నే స్వామి దర్శనము చేసుకొని నిశ్చల భక్తితో ఆ పరమపురుషుని ధ్యానించి కలిదోషనివారణములైన శ్రీపాదలను చూశాడు. శ్రీహరిపాదం చుట్టూ ఉన్న కోట్లాది సౌర్యమండలాల వలె ప్రకాశిస్తున్నాయి తొండమానుడు పూజించిన సువర్ణ కమలాలు. కాని ఆశ్చర్యమ్! కన్నులు మినుమిట్లు గొలిపే ఇంతటి సువర్ణకాంతులలోను రాజుకు వాడిపోయి మట్టి అంటుకొని ఉన్న కమలాలు తులసీదళాలు కనబడ్డాయి. “ఏమిటీ చిత్రమ్? వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి అయినా ఈ సుమాలిక్కడికి ఎలా వచ్చాయి? నేను స్వామిని స్వర్ణ కమాలతో తప్ప పూజించను కదా!” అని తర్కించుకొని నేరుగా స్వామినే ఈ ప్రశ్నవేశాడు. ఆ దయామయుడు చిరుమందహాసముతో ఇలా సమాధానమిచ్చాడు.

“నాయనా! ఇక్కడికి కొంత దూరములో ఉన్న పేదపల్లెలో ఒక సామాన్య కుమ్మరి ఉన్నాడు. అతని పేరు భీముడు. పాపం అతనికి నేనంటే ఎనలేని భక్తి ప్రేమ. అతనుండే ఇంటి మట్టి గోడలో ఒక గూడు చేసి అందులో నా కఱ్ఱబొమ్మ ఒకటి మలచి అందులో నన్ను భావించుకొంటూ పూజిస్తుంటాడు. భక్తుడు ఎక్కడ భావిస్తే అక్కడ దీపించడం నా బాధ్యత కదా! ప్రహ్లాదుని కథ నీకు తెలియనిది కాదుకదా! పాపం అతనికి మంత్రతంత్రాలు తపోయోగాలు ఏమీ తెలియవు. అయినా త్రికరణశుద్ధిగా నిరంతరం నన్ను ధ్యానిస్తూనే ఉంటాడు. తాను కుండలు చేస్తున్నా అన్నం తింటున్నా ఎప్పుడు నా ఊసే! నా ధ్యాసే!

తన కులాచారం ధర్మం ఎల్లవేళలా పాటిస్తాడు. సూర్యోదయాత్పూర్వమే లేచి తనకు తెలిసిన రీతిలో స్నానాది శౌచములు ఆచరించి నా పేరు స్మరిస్తూ తులసీదళాలు సమర్పిస్తాడు. అక్కడ అతడు వేసిన దళాలే నీకిక్కడ కనబడుతున్నాయి. అతనే కాదయ్యా వారి కుటుంబమంతా అంతే. నా మాట నా పాట తప్ప వారికేదీ రుచించదు. ఆ భీమ కులాలుని భక్తిపాశాలకు బంధీ అయిపోయానయ్యా!”

విషయం తెలిసింది తొండమానునికి. భాష్పపూరితనయనాలతో “ప్రభూ!” అని ఆర్తితో పిలిచి స్వామిపాదాలపైపడి “జగన్నాథా! నా తప్పు క్షమించు. నావంటి భక్తుడు లేడని అహంకరించాను. నేను చూసిన ప్రపంచమెంత? నా అనుభవం ఎంత? నాపై దయతో నా బుద్ధిదోషాన్ని పోగొట్టి నిజమైన భక్తుని చేశావు తండ్రీ. ఇదుగో ఇప్పుడే వెళ్ళి భీముని దర్శనము చేసుకొని వస్తాను. నాకు సెలవు ఇవ్వు” అని చెప్పి బయలుదేరాడు రాజు.

“నాహం వసామి వైకుంఠే నయోగి హృదయే రవౌ |
మద్భక్తాః యత్రగాయంతి తత్ర తిష్ఠామి నారద!”

అన్న సూక్తి ప్రకారము భీముని దర్శనము తీర్థయాత్రగా భావించి రాజు నడుచుకుంటూ వెళ్ళాడు. పుణ్యక్షేత్రాలకు కాలినడకనే ప్రయాణము చేయాలి కదా! భీముని ఇల్లు చేరాడు రాజు. భీముని ఇల్లు స్వామి భజనలతో మారుమ్రోగుతున్నది. భీముని పాదాలపైపడి “అయ్యా! శ్రీ వేంకటేశుని ద్వారా నీ మహాత్మ్యము తెలిసుకున్నాను. సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడే నీ భక్తిని కొనియాడాడయ్య! నీ పాదధూళి తాకి పునీతుడని అవుదామని వచ్చాను” అని అన్నాడు తొండమానుడు. చక్రవర్తి ఏమిటి నా పాదలు తాకడం ఏమిటి అని వెనక్కు జరిగిపోయి చేతులు జోడించి “రాజా! అంత పని చేయద్దు. స్వామికి దివ్యాలయం కట్టించిన మహానుభావుడవు నీవు” అని అన్నాడు.

ఇంతలో గరుడారూహుడై స్వామి లక్ష్మీదేవితో సహా ప్రత్యక్షమైనాడు. భీముని ఆనందానికి అంతులేదు. “ఓ దయామయ! నా పూరి గుడిసెకు వచ్చావా! నీ లీలలే లీలలయ్యా. మా తప్పులెన్నక దయావర్షం కురిపించే కాలమేఘానివి స్వామీ నీవు. నేను హనుమంతుని వలె వారధిదాటి నిన్ను మెప్పించలేను, శబరివలె భక్తిశ్రద్ధలు చూపి నిన్ను ఆకట్టుకోలేను, జనకుని వలె సీతను ఇవ్వలేను, నారదుని వలె గంధర్వగానముతో నీ గుణగణాలను కీర్తించలేను, జటాయువు వలె నీకై నా ప్రాణాలు ఇవ్వలేను అయినా నిన్ను శరణువేడిన నన్ను కరుణించిన కరుణామూర్తివి నాయనా నీవు” అని స్తుతించాడు. భీముడిలా తన్మయత్వంతో ఆడిన మాటలను వేదమంత్రాలు వింటున్నంత ప్రీతితో విన్నాడు స్వామి.

మహాభక్తురాలైన భీముని భార్య తమాలినీ కూడా గద్గద స్వరంతో అమ్మని కీర్తించింది. ఆదిదేవుడు మహాలక్ష్మి స్వయంగా తన యింటికివచ్చారు. వారికి ఇవ్వదగినది ఏమీ లేదే అని బిడియపడింది. అది గమనించి శ్రీనివాసుడు “తమాలినీ! నీ చేతితో ఏది వండి ఇచ్చినా తింటానమ్మా” అని అన్నాడు. తమాలినీ సంతోషానికి పట్టపగ్గాలులేవు. తనకు పెద్దల వలన తెలిసినంతలో యథాశక్తిగా శుచితో తామర తూడ్లతో వంటకాన్ని వండి లక్ష్మీనారాయణులకు వడ్డించింది. తృప్తిగా ఆరగించారు అలమేలుమంగాశ్రీనివాసులు. తొండమానుడు చూస్తుండగానే దివ్యశరీరధారులై వైకుంఠధామానికి చేరారు భీమకులాల దంపతులు.

ఇదంతా ఆశ్చర్యంగా చూసిన తొండమాను “ప్రభూ! నా సంగతేమిటి” అని ప్రాధేయపడ్డడు. అప్పుడు జగన్నాథుడు “రాజా! తరువాత జన్మలో నీవు విరాగివై నా ఏకాంతభక్తుడవు అవుతావు. అప్పుడు తప్పక నీకు ముక్తి లభిస్తుంది” అని చెప్పి తొండమానుని ఊరడించాడు. ఇలా తొండమానునికి భీమునికి ముక్తిని ప్రసాదించాడు శ్రీవేంకటేశుడు.

పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దాము:

  1. అహంకారం ఎంతవారికైనా ఎంతకొంచమైనా తగదు. మహనీయుడైన తొండమానునికే అహంకారము వలన భంగపాటు తప్పలేదు. ఇక సామాన్యులమైన మనసంగతి ఏమిటి? కాబట్టి మనమెల్లప్పుడు వినయవిధేయతలతో ఉండాలి.
  2. కులధర్మం కర్తవ్యం పాటిస్తూ స్వామిని నిష్కల్మష భక్తితో కొలిచే వారిని కరుణిస్తాడు భగవంతుడు అని నిరూపించాడు భీముడు. కులం కన్నా గుణం ప్రధానం కదా!

Search Terms: Tondaman, Tondamaan, Bhima Kulaala, Tamaalini, Tamalini, Venkateswara, Venkateshwara.


శుక్రాచార్యులు కచుడు – ఆదర్శ గురుశిష్యులు

డిసెంబర్ 29, 2006

(kacha.pdf)

మహాభారతము లోని కథ

ఇది క్షీరసాగర మంథనమునకు పూర్వం జరిగిన కథ. దేవదానవులకు అమృతకలశం అప్పటికింకా లభించలేదు. దేవదానవ యుద్ధాలు అతి భీకరముగా జరిగేవి. ఇరుపక్షాల ఎందఱో సైనికులు అసువులు బాసేవారు. ఇలావుండగా రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు తీవ్ర తపస్సుచేసి మృతసంజీవనీ విద్యను సంపాదించాడు. ఇంకేమున్నది? యుద్ధములలో చచ్చిన రాక్షసులను సంజీవనీ విద్య ద్వారా బ్రతికించేవాడు శుక్రుడు. వాళ్ళు మళ్ళీ దేవతలపై పడి పోరుసాగించేవారు. దేవతలు ఎంత బలవంతులైనా ఇలా జరిగేసరికి వారి శక్తి క్షీణించసాగినది. మంచికి అపజయం కలుగుట చూడలేని దేవతాగురువు బృహస్పతుల వారు తన కుమారుడైన కచుని పిలిచి శుక్రుని శిష్యుడవై మృతసంజీవని అభ్యసించిరమ్మని ఆదేశించాడు.

పాపభీతి లేని రాక్షసులతో వ్యవహారము తన కుమారుని ప్రాణాలకే అపాయమని తెలిసికూడా ధర్మస్థాపనార్థం తన కుమారుని ఆ అసాధ్యకార్యము నిర్వర్తించుకొని రమ్మని పంపినాడు బృహస్పతి. పిత్రాజ్ఞాపాలకుడైన కచుడు వెంటనే బయలుదేరి శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి సాష్టాంగ ప్రణామము చేసి “గురుభ్యోనమః స్వామీ నేను ఆంగీరస గోత్రజాతుడను. దేవగురువులైన బృహస్పతులవారి తనయుడను. నన్ను కచుడని పిలుస్తారు. విద్యార్థినై మీ వద్దకు వచ్చాను” అని ప్రార్థించాడు. కచుని వినయానికి సంతోషించి శుక్రుడు “నాయనా! వినయవిధేయతలే విద్యార్జనకు ప్రథమ సోపానాలు. నీవంటి అర్హుడిని శిష్యుగా స్వీకరించుట నాకు ఆనందదాయకము” అని ఆశీర్వదించి తన శిష్యబృందములో చేర్చుకొన్నాడు.

కచుడు రోజూ సూర్యోదయాత్పూర్వమే లేచి కాలకృత్యాలు తీర్చుకుని సలిలోదకాలతో స్నానాది క్రియలు నిర్వహించి సంధ్యావందనాది ఆహ్నికాలు యథావిధిగా చేసేవాడు. తీవ్రమైన బ్రహ్మచర్య నిష్ఠను అవలంభిస్తూ ఎంతో ప్రీతితో గురుశుశ్రూష చేసేవాడు. భక్తి ఏకాగ్రతలతో వేదశాస్త్రాలు అభ్యసించేవాడు.

శుక్రాచార్యునికి యవ్వని త్రిలోకసౌందర్యవతి దేవయాని అను పేరుగల కుమార్తె ఉండేది. ఆమె సౌందర్యం అద్వితీయమ్. పైగా కచునిపై మనసుపడింది. కానీ కఠోర బ్రహ్మచర్యవ్రతుడైన కచుడు ఆమెను సరిగా చూడనుకూడా లేదు. కచుడు గురుపుత్రి అయిన దేవయానిని సోదరిగా భావించేవాడు. కచుని వినయం సంస్కారం విద్యలపైనున్న కుతూహలం అతనిని శుక్రునికి ఎంతో ప్రియునిగా చేసినాయి.

కచుని మంచితనం చూచి అసూయతో మిగతా రాక్షస శిష్యులందఱూ సమావేశమై ఇలా అనుకొన్నారు “వీడు మన శత్రువుల పక్షము. వీడికి మృతసంజీవనీ విద్య లభిస్తే అది మనకు అపాయకరము. కనుక వీడిని చంపి పారేద్దాము”. శుక్రుని గోవులను కాచి అడవినుంచి ఇంటికి తిరిగివస్తున్న కచుని నిర్దాక్షిణ్యంగా చంపేశారు ఆ రక్కసులు. కచుడు రావటం ఆలస్యమైనదని చింతించి దేవయాని తండ్రితో “నాన్నా! ఎంత అవసరం వచ్చినా కనీసం సాయంకాల సంధ్యావందన సమయానికైనా ఆశ్రమానికి తిరిగి వచ్చేవాడు కచుడు. కానీ ఇవాళ ఇంత ప్రొద్దెక్కినా ఇంత వరకూ రాలేదు. దయచేసి మీ దివ్యదృష్టితో కచుని జాడ తెలుసుకోండి” అని ప్రార్థించింది. శుక్రుడు దివ్యదృష్టితో జరిగినది తెలుసుకున్నాడు. వెంటనే తన మృతసంజీవనీ విద్యతో కచుని బ్రతికించాడు.

ఈర్ష్యాగ్నిచే జ్వలించబడుతున్న రాక్షసులకు ఈ విషయము తెలిసినది. మరునాడు మళ్ళీ కచుని సంహరించి దేహాన్ని కాల్చి బూడిద చేసి దాన్ని మదిరలో కలిపి వినయంగా శుక్రిని ఇచ్చారు. శుక్రుడు ఆ మదిరను పానముచేశాడు. కచుడు ఎంతకీ రాకపోయేసరికి దేవయాని మళ్ళీ తండ్రితో మొరపెట్టుకున్నది. శుక్రుడు దివ్యదృష్టితో జరిగినది తెలుసుకుని ఎంతో బాధ పడి “ఈ రాక్షసులు చాలా కిరాతకులు. తెలియకుండా నేనెంత తప్పుచేసాను! ఈ మదిరాపానము చాలా ఘోరమైనది. దీని మత్తు ప్రభావము వలన నా వివేచన నశించినది” అనుకొని ఇకపై ఎవరిచే ఇట్టి తప్పులు జరుగరాదని ఈ విధముగా కట్టడి చేసినాడు:

“ఎంత కొంచమైననూ మదిరాపానము చేయరాదు. అది మహాపాపము”. ఇలా ధర్మనియమం తెలియజెప్పి మళ్ళీ ఇలా అన్నాడు “కానీ తెలిసిచేసినా తెలియక చేసినా తప్పు తప్పే కదా! నేను చేసిన తప్పును సరిదిద్దుకొనెదను. మృతసంజీవనీ విద్యను నా కడుపులో సూక్ష్మ రూపములో ఉన్న కచునకు ఉపదేశించెదను. ఆపై అతనిని బ్రతికించెదను. కచుడు నా ఉదరము చీల్చుకువచ్చి మృతుడనైన నన్ను బ్రతికించెదడు”. శుక్రుడు అలాగే చేశాడు. కచుడు శుక్రగర్భం నుంచి బయటకు వస్తూనే గురువు గారిని బ్రతికించినాడు. ప్రణామము చేసి శుక్రుని వద్ద సెలవు తీసుకొని ఇంటికి బయలుదేరినాడు.

అప్పుడు దేవయాని తన ప్రేమను వ్యక్త పఱచి తనను వివాహమాడమని నిర్బంధించింది. అంతట కచుడు “సోదరీ! నీవు నా గురు పుత్రికవు. కావున నాకు చెల్లెలివి అవుతావు. నీకిట్టి అధర్మ కోరిక కలుగరాదు” అని హితవు చెప్పాడు. నిరాకరించిన కచునిపై క్రోధిత అయి దేవయాని కచుని ఇలా శపించినది “నన్ను హింసించిన ఫలముగా ఈ విద్య నీకు ఉపకరించదు పో”! దేవయాని అమాయకత్వాన్ని చూసి ఇలా సమాధానమిచ్చాడు కచుడు

“చెల్లీ! విద్య ఎన్నడూ నిరుపయోగం కాదమ్మా! ఈ విద్య నాకు ఉపకరించక పోతేనేమి? అర్హులైన పరులకు నేర్పి వారికి ఉపయోగపడతాను. సమాజశ్రేయస్సుకై నా విద్య ఉపకరించుట కన్న నాకేమి కావాలి”? అని చెప్పి ఆనందముగా తిరిగి వెళిపోయాడు కచుడు.

పిల్లలూ! మనమీ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాము:

  1. దేశంకోసం ఒక గ్రామాన్ని, గ్రామం మేలుకై ఒక కుటుంబాన్ని, కుటుంబ శ్రేయస్సుకై ఒక కుటుంబ సభ్యుని త్యజించుట ధర్మము. ఈ సూక్ష్మం ఎఱిగిన బృహస్పతి తన ప్రియ కుమారుని ప్రాణాలను సైతం లెక్కసేయక దేవతలను కాపాడటానికి కచుని రాక్షస గురువు వద్దకు పంపించాడు.
  2. శత్రువని తెలిసి కూడా అర్హుడైన వాడు కాబట్టి కచునికి సంతోషముగా విద్యనేర్పించి ఆదర్శ గురువైనాడు శుక్రుడు. కచుడు శ్రద్ధాభక్తులతో విద్యలను అభ్యసించాడు. దేవయాని పట్ల ప్రవరాఖ్య నిగ్రహం చూపించి ఉత్తమ శిష్యుడైనాడు కచుడు. కావున మనకు ఈ శుక్రకచులు ఆదర్శప్రాయులు కావాలి.
  3. ఈర్ష అనేది పెనుభూతము. మత్సరముచే దారుణముగా కచుని చంపివేసినారు రాక్షసులు. అట్లు చేసి కచునికి సంజీవనీ మంత్రోపదేశం కలుగుటకు చేచేతులారా వారే కారణమైతిరి. వివేకహీనులు తెలియకనే వారికి వారే కీడు కలిగించుకొనెదరు.
  4. మదిరాపానము మహాపాపము (శంఖలిఖితుల కథ చూడండి). ఈ విషయమును మరొక్కమాఱు మనకు తెలియజేశాడు శుక్రుడు.
  5. గురుపుత్రిక సోదరి అని గ్రహించి దేవయానిని సోదరీభావముతో చూసిన కచుని ధర్మజ్ఞత మనకు కనువిప్పు కావాలి.
  6. చోరులచే చోరింపబడనిది అర్హులకు పంచి ఇస్తే పెరిగేదీ విద్యాధనమొక్కటే. విద్య యొక్క గొప్పతనము మనకు కచుని అమృతవాక్కుల ద్వారా ఈ కథలో తెలిసినది. మనమెప్పుడూ సమాజశ్రేయస్సునకే విద్యను ఉపయోగించాలి. విద్యాభ్యాసమునకు సార్థకత అప్పుడే కలుగును.

Search Terms: Kacha, Kaca, Shukra, Sukra, Shukraachaarya, Devayani, Devayaani.


శ్రీకృష్ణ లీలలు – వ్యోమాసుర భంజనమ్

డిసెంబర్ 28, 2006

(vyomasura.pdf)

శ్రీ గర్గభాగవతము లోని కథ

ఒకరోజు నందనందనుడు గోపాలురతో కలిసి ఆడుచుండెను. కొందఱు గోవులుగా మరికొందఱు మేకలుగా కొందఱు చోరులుగా మరియు కొందఱు పసులకాపరులుగా విడివడి ఆడుచుండిరి. కంసప్రేరితుడైన వ్యోమాసురుడు చోరుల గుంపులో చేరి గోవులుగా మేకలుగా గోపాలురుగా నటిస్తున్న బాలులను ఎత్తుకొని పోయి ఒక బిలమున దాచి బిలద్వారము మూసివేసెను. పరమాత్మ అది గ్రహించి రక్కసుని రెండుకాళ్ళు పట్టుకొని గిరగిరా త్రిప్పి నేలపై విసిరిగొట్టెను. మృతుండైన వ్యోమాసురుని లోని తేజస్సు పరమాత్మలో లీనమయ్యెను.

(ఈ బొమ్మ చూడండి)

వ్యోమాసురుని చరిత్ర

పూర్వం మహాపుణ్యక్షేత్రమగు భవ్య కాశీనగరమును భీమరథుడు అను రాజేంద్రుడు పరిపాలించెడివాడు. అతడు మేధావి దానశీలి ధర్మజ్ఞుడు పైగా శ్రీహరి భక్తుడు. రాజ్యభారమును యోగ్యుడైన కుమారునికి అప్పగించి రమేశుని పై అనురక్తుడై తపముకై మలయపర్వతమునకు ఏగెను. అక్కడ ఆశ్రమములో నివసించి తపమును సాగించుచుండెను.

ఒకనాడు బ్రహ్మమానస పుత్రుడు పరమపూజ్యుడు అయిన పులస్త్య మహర్షి శిష్యవర్గముతో భీమరథుని ఆశ్రమమునకు వచ్చెను. త్రిలోకపూజ్యుడైన పులస్త్యునకు రాజు నమస్కరించెనే కానీ యథావిధి అతిథి సత్కారము చేయలేదు. ధర్మము తప్పినందుకు మహర్షి “రాజా! ఇంటికి వచ్చిన వానిని సత్కరింపకుండుట అసురలక్షణము. కావున నీవు రాక్షసుడివి కమ్ము”! అని శపించెను. పశ్చాత్తాపముతో శరణువేడిన రాజును కరుణించి పులస్త్యుడు “నీ దుష్కర్మకు ఫలితమనుభవించక తప్పదు. కానీ నీవు అఖండ విష్ణుభక్తుడవగుటచే నీకు ద్వాపరయుగములో శ్రీకృష్ణపరమాత్మ అనుగ్రహము కలుగును. భగవంతుడు భక్తుల కెన్నడు అపజయము కలిగించడు కదా!” అని ఆశీర్వదించెను. ఆ భీమరథుడే వ్యోమాసురుడు.

కావున పిల్లలూ! మనమెన్నడు ఇంటికి వచ్చిన అతిథిని సత్కరింపక ఉండరాదు. అభ్యాగతః స్వయం విష్ణుః అన్న సూక్తిని మఱువరాదు.

Search Terms: Krishna, Vyomasura, Vyomaasura, Bhimaratha, Bheemaratha.


నాడీజంఘుని క్షమాగుణమ్

డిసెంబర్ 27, 2006

(nadijangha.pdf)

మహాభారతము లోని కథ

పూర్వం ఒకానొక గ్రామములో బ్రాహ్మణాధముడొకడు ఉండేవాడు. అతడు తన స్వధర్మమును వీడి వేదశాస్త్రాధ్యయనములు మఱచి చివరికి ఒక బోయదాని వివాహమాడి మాంస భక్షకుడై నిత్యము హింసాజీవితాన్ని గడపసాగినాడు. ఇంద్రియసుఖములే ఉత్తమమనుకొనేవారు విషయవాంఛలతో లోకోపకరమైన ధర్మమును విడనాడి మహాదురితాలను సైతం చేయుటకు వెనుకాడరు కదా!

అతడొకమాఱు ధనాపేక్షతో కొందఱు వ్యాపారులతో కలసి వాణిజ్యార్థము దేశాంతరం వెళ్ళాడు. మార్గమధ్యములో ఒక భీకరకాంతారమును వారు దాటుచున్నప్పుడు మత్తగజమొకటి వారిని తరిమినది. ప్రాణభీతితో వారు తలకొకవైపుకు పరుగులెట్టారు. ధర్మభ్రష్టుడైన బ్రాహ్మణుడలా తన మిత్రులనుండి దూరమై గహనాటవిలో దారిదప్పి తీవ్ర క్షుత్పిపాసలతో సొమ్మసిల్లి ఒక పెద్ద మఱ్ఱిచెట్టు వద్ద కూలబడ్డాడు.

ఆ వృక్షము నాడీజంఘుడనే ధర్మవర్తనుడైన బకరాజు నివాసము. నాడీజంఘునికి “రాజధర్ముడు” అనే సార్థక బిరుదు కూడా ఉన్నది. సృష్టికర్త అయిన చతుర్ముఖుడు నాడీజంఘుని మిత్రుడు. ఆకలిదప్పులతో వచ్చిన భ్రష్టవిప్రుని చూసి నాడీజంఘుడు జాలిపడి అతిథిభావముతో అతని సత్కరించి ఫలోదకాలిచ్చి తృప్తి పఱచినాడు. తన పెద్ద రెక్కలను విసనకఱ్ఱ వలె వీచి సేదతీర్చాడు. అప్పటికే రాత్రి అవడముతో నాడీజంఘుడు విప్రాధమునితో ఇలా అన్నాడు “మహానుభావా! మీరు నాకు మిత్రులైనారు. మిత్రుని బాధలు తీర్చుట కనీస కర్తవ్యము. ఇక్కడికి మూడుయోజనాల దూరములో మధువ్రజమనే రాజ్యమున్నది. దాని రాజైన విరూపాక్షుడు నా ప్రియమిత్రుడు. అతడు రాక్షసుడైననూ పరమశాంతుడు ధార్మికుడు. అతని వద్దకు మీరు వెళితే తప్పక మిమ్ము సత్కరించగలడు. ఱేపు ప్రొద్దున్నే బయలుదేరి వెళ్ళవచ్చు. ఇప్పుడు నిశ్చింతగా విశ్రమించండి”.

అతిథిసేవా నిరతుడైన నాడీజంఘుడిలా వాక్సుధలను చిలికించి బ్రాహ్మణుని వన్యమృగాలనుండి కాపాడుటకై రాత్రంతా మేల్కొని రక్షణనిచ్చాడు. ఉదయాన్నే బ్రాహ్మణుడు మధువ్రజమునకు బయలుదేరినాడు. నాడీజంఘుని మిత్రుడని తెలియగానే విరూపాక్షుని వద్దకు బ్రాహ్మణుని సగౌరవముగా తీసుకువెళ్ళారు మధువ్రజ రాజసేవకులు.

ఒకవ్యక్తి ఆచరించే ధర్మాధర్మాలు భావాలు అతడి ఆకృతిలో స్పష్టముగా ప్రతిబింబిస్తాయి. ధర్మాత్ముడు పైగా రాజు అవడముతో బ్రాహణుడు కులభ్రష్టుడు నీచుడు అని చూడగానే పసిగట్టాడు విరూపాక్షుడు. కానీ నాడీజంఘుని మిత్రుడు అని అతనిని సగౌరవముగా సత్కరించి ఎంతో ధనమిచ్చి పంపించాడు విరూపాక్షుడు. మోయలేనన్ని ధనరాసులను పేరాశతో మోస్తూ తిరిగి నాడీజంఘుని నివాసము చేరాడు పతిత బ్రాహ్మణుడు. నాడీజంఘుడు మళ్ళీ యథావిధిగా ఆతిథ్యమిచ్చి సేదతీర్చాడు. అలసి ఉన్న బ్రాహ్మణుడు ఆదమఱచి నిదుర పోయాడు.

మన జీవన విధానం మన ఆలోచనల్ని బుద్ధిని ప్రభావింపజేస్తుంది (సత్యసంధః కథలో సీతమ్మ చెప్పిన ఋషికథ ఇందుకు నిదర్శనము). కనుకనే భారతీయులు సద్భావ సత్ప్రవర్తనలను ఆచారముల ద్వారా వారి దైనందిన జీవితములలో అలవరచుకుని ఎల్లప్పుడు ధర్మమార్గముననే చరిస్తారు. దయయే స్వభావముగా కలిగి దయాళువు అయినవాడే విప్రుడు. అట్లుకాక నిరంతరము కౄరకర్మములు చేయుట వలన ఆ పతిత బ్రాహ్మణుని బుద్ధి వక్రమైనది. అన్నం పెట్టి ఆదరించి క్రొత్త జీవితాన్ని ప్రసాదించిన నాడీజంఘునిలో పతితబ్రాహ్మణునికి భగవంతుడు కనబడలేదు. ఒక రుచికరమైన భోజనం కనబడింది! బలిష్టమైన నాడీజంఘుని దేహాన్ని బ్రాహ్మణుడు చూచి ఇలా అనుకొన్నాడు “ఱేపటి నుంచి నేను ఇల్లు చేరేలోపల మళ్ళి ఆహారము దొరుకుతుందో లేదో. పైగా ఈ కొంగ బలిష్టముగా ఉంది. దీని మాంసము ఎంతో రుచికరముగా ఉంటుంది. దీన్ని చంపి మాంసము మోసుకు వెళతాను”. వెంటనే దొడ్డుకఱ్ఱ తీసుకొని నాడీజంఘుని తలపై బలంగా కొట్టాడు. ఆ శిరోఘాతానికి అసువులు బాసాడు నాడీజంఘుడు! చర్మం వొలిచి మాంసాన్ని మూటకట్టుకొని ప్రణాయమయ్యాడా దురితుడు.

మనకు ప్రియులైన వారు ఎంత దూరములో ఉన్నా వారికి ఆపద వస్తే మన హృదయం స్పందిస్తుంది. తన ప్రియమితునికి ఏదో కీడుసంభవించిందని తెలుసుకొని విరూపాక్షుడు తన సైనికులను విషయము కనుక్కొని రమ్మని పంపించాడు. వారు జరిగిన దారుణము తెలుసుకొని విరూపాక్షునికి నివేదించారు. అతని ఆజ్ఞపై పతితవిప్రుని బంధించి తెచ్చారు. కృతఘ్నుడు మిత్రద్రోహి అయిన బ్రాహ్మణుని చూచి విరూపాక్షుడు “భటులారా! కృతఘ్నతకు మించిన మహాపాపములేదు. వీడిని ఖండఖండాలుగా నరికి తినివేయండి. రాక్షసులు కాబట్టి మీరు నరమాంసము తినవచ్చు” అని ఆజ్ఞాపించాడు.

“క్షమించండి మహారాజా! ఇటువంటి పాపాత్ముడి మాంసం వాసనకూడా మేము చూడలేము” అని భటులుచెప్పి కుక్కలకు వేశారు. కుక్కలు కూడా ఆ కృతఘ్నుని మాంసము ముట్టలేదు!

నాడీజంఘుని శరీరభాగాలు ఒకచోటచేర్చి దహనసంస్కారాలు యథావిధి కర్మకాండ చెశాడు విరూపాక్షుడు. విధాత తన ప్రియమిత్రుని మరణవార్త విని వెంటనే కామధేనువును నాడీజంఘుని బ్రతికించమని ఆజ్ఞాపించాడు. గోక్షీరములోని అమృతశక్తి ప్రభావముతో నాడీజంఘుడు పునర్జీవితుడైనాడు. బ్రతికిన మిత్రుని చూసి ఎంతో సంతోషించి ఆలింగనము చేసుకొని జరిగినదంతా వివరించాడు విరూపాక్షుడు.

తన ఇంటికి వచ్చిన అతిథి మిత్రుడు అయిన బ్రాహ్మాణుడు సంహరించబడ్డాడని తెలుసుకొని బాధపడ్డాడు నాడీజంఘుడు! వెంటనే బ్రహ్మదేవుని పతితబ్రాహ్మణుని బ్రతికించమని ప్రాధేయపడ్డాడు. విరించి రాజధర్ముని క్షమాగుణాన్ని చూచి అబ్బురపడి అతని ధర్మజ్ఞతకు సంతసించి భ్రష్టవిప్రుని బ్రతికించినాడు. విరూపాక్షుడిచ్చిన ధనము మరల ఇప్పించి సగౌరవముగా బ్రాహ్మణుని ఇంటికి పంపించాడు నాడీజంఘుడు!

ఇది చూసి నాడీజంఘుని మెచ్చుకొని బ్రహ్మదేవుడిలా అన్నాడు “నాడీజంఘుని ఔదార్యముతో ఇప్పుడు బ్రతికిపోయినా ఈ అధమునికి నిష్కృతిలేదు. జన్మజన్మాల వరకూ ఈ మహాపాపము వాడిని క్షోభింపజేస్తుంది. చేసిన కర్మ చెడని పదార్థము. ఫలితమనుభవింపక తప్పదు. ఏ పాపానికైనా నిష్కృతి ప్రాయశ్చిత్తము ఉన్నదేమో కానీ కృతఘ్నతకు మిత్రద్రోహానికి మాత్రం లేదు.

మహాత్మా! రాజధర్మా! ప్రియమిత్రా నాడీజంఘా! నీ క్షమా గుణం అద్వితీయము. దేవతలు సైతం నీకు నమస్కరిస్తారు. శుభంభూయాత్”.

పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దాము:

  1. మన జీవన విధానం మన ఆలోచనల్ని బుద్ధిని ప్రభావింపజేస్తుంది. ఆచారముతోనే ధర్మవర్ధనము జరుగుతుంది. దైవభీతి పాపభీతి లేనివాడు తనకుతానే కాక సమాజానికి కూడా హానికరము. స్వధర్మమును వీడిన బ్రాహ్మణుడు ఎన్నో దురితాలు చేసి భ్రష్టుడైన వైనం మనకు కనువిప్పు కావాలి.
  2. నాడీజంఘుని (రాజధర్ముని) అతిథిసేవ మిత్రవాత్సల్యం క్షమాగుణములు మనకు ఆదర్శప్రాయములు. ధర్మవర్తనులమైతే బ్రహ్మలోక ప్రాప్తి కరతలామలకము అని నాడీజంఘుడు మనకు చూపినాడు.

Search Terms: Nadijangha, Naadii jangha, Virupaksha, Vipruupaaksha.


భూతదయ

డిసెంబర్ 26, 2006

(bhutadaya.pdf)

పెద్దలు చెప్పిన నీతికథ

అది భవ్యమైన ఉజ్జయినీ నగరపు రాచవీధి. ప్రొద్దుకుంకినా ఆ దారిలోని దేశవిదేశ వర్తకుల సంఖ్య బేరసారాలాడుతున్న జనావళి రద్దీ తగ్గలేదు! రాత్రి కొంత గడచిన తరువాత కాస్త కాస్తగా రద్దీ తగ్గటం మొదలుపెట్టింది. ఇంతలో తేనెలమ్మే ఒక వయ్యారి తన వన్నెచిన్నెలు ఒలకబోస్తూ ఆ వీధివెంట వచ్చి బుట్ట క్రిందికి దించి అమ్మకం మెదలుపెట్టింది. నిమిషములో కొన్ని లక్షలాది చీమలు మధువు కోసం ఆ వన్నెలాడి తేనె బుట్ట వద్దకు చేరినాయి. చీమల పుట్టలు చూసి వాటిని బఠానీల్లా నములుదామని ఒక తొండ అక్కడికి వచ్చింది.

రాత్రంతా నగరంలోని వేడుకల వలన జనసంచారమునకు భయపడి బయటకురాని ఎలుక తొండకోసం వచ్చింది. పిల్లిగారు ఆ తొండని గుటకాయస్వాహా చేద్దామని పొంచినిలిచినారు. పిల్లికోసం కుక్క కూడా అక్కడికి వచ్చింది. రాచవీధిలోని వేటకుక్కలు ఊరికుక్కని చూసి హంగామా చేశాయి.

ఇంతలో ఒక మాంత్రికుడు తన మంత్రశక్తి ద్వారా అడవిలోని ఒక పెద్దపులిని బంధించి రాచవీధిన తెస్తున్నాడు రాజుగారికి చూపించి మెప్పుపొందుదామనే ఉద్దేశ్యముతో. పౌరుషంలేని పులిని చూసి వేటకుక్కలు మీదపడ్డాయి. మరే జంతువైనా మంత్రించి బంధించేసేవాడు మాంత్రికుడు కానీ రాజుగారి వేటకుక్కలయ్యేసరికి కిమ్మనక ఉండిపోయాడు. ఈ గందరగోళానికి రాచభటులు ఆ పై మహామంత్రిగారు అక్కడికి వచ్చి పరిస్థితులను సమీక్షించి రాజుగారికి నివేదించారు. రాజుగారు “నగరపు ముఖ్యవీధిలోనే ఇంత అల్లకల్లోలం ఎందుకు జరిగింది?” అని ప్రశ్నించాడు.

సూక్ష్మబుద్ధి అయిన మహామంత్రి ఇలా సమాధానమిచ్చినాడు “ప్రభు! కొద్దికాలముగా మన దేశములోని యువత రాత్రంతా వేడుకలతో సంబరాలతో గడుపుతున్నది. దీనివలన నిశాచరులైన జంతువులకు వేట కుదరటంలేదు. ఆహారము దొరకని కారణముగా ప్రకృతిలో ఈ అసహజస్థితి వచ్చినది. మానవునితో పాటు సహజీవనము చేసే భూతజాలములకు సైతం దయ చూపమని మన భారతీయ సంస్కృతి ఘోషిస్తున్నది కదా”!

ప్రజాహితుడైన ఉజ్జయినీ మహారాజు వెంటనే “రాత్రి ఒక జాము నగారా తరువాత వీధులలో జనసంచారము ఉండరాదు” అని దండోరా వేయించాడు.

పిల్లలూ! ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దాము:

మన చిన్నప్పుడు అమ్మ “బాబూ! రాత్రయిందిరా! ఇంక ఆటలు మాని ఇంటికి రారా. వేళకానివేళ ఆడితే నేలతల్లి కోపిస్తుందిరా! మంచి పిల్లలు త్వరగా పడుకుని తెల్లవారకముందే లేస్తారు” అని చెప్పి మందలించిన సన్నివేశం మనందఱికీ గుర్తే. ఈ సూక్తి వెనుకనున్న తత్త్వం మనకు మహామంత్రి మాటల ద్వారా తెలిసినది. ఈ విధముగానే అన్ని ప్రాచీన ఆచార సాంప్రదాయాల వెనుక ఆరోగ్య, సామాజిక, ఆధ్యాత్మిక హేతువులు కలవు. వాటి వివరమెఱిగి అనాదిగా వస్తున్న ఆచారాలను కాపాడుకొంటూ ముందు తరాలకు అందించుట మన కనీసకర్తవ్యము.