మహాభారతము లోని కథ
ఇది క్షీరసాగర మంథనమునకు పూర్వం జరిగిన కథ. దేవదానవులకు అమృతకలశం అప్పటికింకా లభించలేదు. దేవదానవ యుద్ధాలు అతి భీకరముగా జరిగేవి. ఇరుపక్షాల ఎందఱో సైనికులు అసువులు బాసేవారు. ఇలావుండగా రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు తీవ్ర తపస్సుచేసి మృతసంజీవనీ విద్యను సంపాదించాడు. ఇంకేమున్నది? యుద్ధములలో చచ్చిన రాక్షసులను సంజీవనీ విద్య ద్వారా బ్రతికించేవాడు శుక్రుడు. వాళ్ళు మళ్ళీ దేవతలపై పడి పోరుసాగించేవారు. దేవతలు ఎంత బలవంతులైనా ఇలా జరిగేసరికి వారి శక్తి క్షీణించసాగినది. మంచికి అపజయం కలుగుట చూడలేని దేవతాగురువు బృహస్పతుల వారు తన కుమారుడైన కచుని పిలిచి శుక్రుని శిష్యుడవై మృతసంజీవని అభ్యసించిరమ్మని ఆదేశించాడు.
పాపభీతి లేని రాక్షసులతో వ్యవహారము తన కుమారుని ప్రాణాలకే అపాయమని తెలిసికూడా ధర్మస్థాపనార్థం తన కుమారుని ఆ అసాధ్యకార్యము నిర్వర్తించుకొని రమ్మని పంపినాడు బృహస్పతి. పిత్రాజ్ఞాపాలకుడైన కచుడు వెంటనే బయలుదేరి శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి సాష్టాంగ ప్రణామము చేసి “గురుభ్యోనమః స్వామీ నేను ఆంగీరస గోత్రజాతుడను. దేవగురువులైన బృహస్పతులవారి తనయుడను. నన్ను కచుడని పిలుస్తారు. విద్యార్థినై మీ వద్దకు వచ్చాను” అని ప్రార్థించాడు. కచుని వినయానికి సంతోషించి శుక్రుడు “నాయనా! వినయవిధేయతలే విద్యార్జనకు ప్రథమ సోపానాలు. నీవంటి అర్హుడిని శిష్యుగా స్వీకరించుట నాకు ఆనందదాయకము” అని ఆశీర్వదించి తన శిష్యబృందములో చేర్చుకొన్నాడు.
కచుడు రోజూ సూర్యోదయాత్పూర్వమే లేచి కాలకృత్యాలు తీర్చుకుని సలిలోదకాలతో స్నానాది క్రియలు నిర్వహించి సంధ్యావందనాది ఆహ్నికాలు యథావిధిగా చేసేవాడు. తీవ్రమైన బ్రహ్మచర్య నిష్ఠను అవలంభిస్తూ ఎంతో ప్రీతితో గురుశుశ్రూష చేసేవాడు. భక్తి ఏకాగ్రతలతో వేదశాస్త్రాలు అభ్యసించేవాడు.
శుక్రాచార్యునికి యవ్వని త్రిలోకసౌందర్యవతి దేవయాని అను పేరుగల కుమార్తె ఉండేది. ఆమె సౌందర్యం అద్వితీయమ్. పైగా కచునిపై మనసుపడింది. కానీ కఠోర బ్రహ్మచర్యవ్రతుడైన కచుడు ఆమెను సరిగా చూడనుకూడా లేదు. కచుడు గురుపుత్రి అయిన దేవయానిని సోదరిగా భావించేవాడు. కచుని వినయం సంస్కారం విద్యలపైనున్న కుతూహలం అతనిని శుక్రునికి ఎంతో ప్రియునిగా చేసినాయి.
కచుని మంచితనం చూచి అసూయతో మిగతా రాక్షస శిష్యులందఱూ సమావేశమై ఇలా అనుకొన్నారు “వీడు మన శత్రువుల పక్షము. వీడికి మృతసంజీవనీ విద్య లభిస్తే అది మనకు అపాయకరము. కనుక వీడిని చంపి పారేద్దాము”. శుక్రుని గోవులను కాచి అడవినుంచి ఇంటికి తిరిగివస్తున్న కచుని నిర్దాక్షిణ్యంగా చంపేశారు ఆ రక్కసులు. కచుడు రావటం ఆలస్యమైనదని చింతించి దేవయాని తండ్రితో “నాన్నా! ఎంత అవసరం వచ్చినా కనీసం సాయంకాల సంధ్యావందన సమయానికైనా ఆశ్రమానికి తిరిగి వచ్చేవాడు కచుడు. కానీ ఇవాళ ఇంత ప్రొద్దెక్కినా ఇంత వరకూ రాలేదు. దయచేసి మీ దివ్యదృష్టితో కచుని జాడ తెలుసుకోండి” అని ప్రార్థించింది. శుక్రుడు దివ్యదృష్టితో జరిగినది తెలుసుకున్నాడు. వెంటనే తన మృతసంజీవనీ విద్యతో కచుని బ్రతికించాడు.
ఈర్ష్యాగ్నిచే జ్వలించబడుతున్న రాక్షసులకు ఈ విషయము తెలిసినది. మరునాడు మళ్ళీ కచుని సంహరించి దేహాన్ని కాల్చి బూడిద చేసి దాన్ని మదిరలో కలిపి వినయంగా శుక్రిని ఇచ్చారు. శుక్రుడు ఆ మదిరను పానముచేశాడు. కచుడు ఎంతకీ రాకపోయేసరికి దేవయాని మళ్ళీ తండ్రితో మొరపెట్టుకున్నది. శుక్రుడు దివ్యదృష్టితో జరిగినది తెలుసుకుని ఎంతో బాధ పడి “ఈ రాక్షసులు చాలా కిరాతకులు. తెలియకుండా నేనెంత తప్పుచేసాను! ఈ మదిరాపానము చాలా ఘోరమైనది. దీని మత్తు ప్రభావము వలన నా వివేచన నశించినది” అనుకొని ఇకపై ఎవరిచే ఇట్టి తప్పులు జరుగరాదని ఈ విధముగా కట్టడి చేసినాడు:
“ఎంత కొంచమైననూ మదిరాపానము చేయరాదు. అది మహాపాపము”. ఇలా ధర్మనియమం తెలియజెప్పి మళ్ళీ ఇలా అన్నాడు “కానీ తెలిసిచేసినా తెలియక చేసినా తప్పు తప్పే కదా! నేను చేసిన తప్పును సరిదిద్దుకొనెదను. మృతసంజీవనీ విద్యను నా కడుపులో సూక్ష్మ రూపములో ఉన్న కచునకు ఉపదేశించెదను. ఆపై అతనిని బ్రతికించెదను. కచుడు నా ఉదరము చీల్చుకువచ్చి మృతుడనైన నన్ను బ్రతికించెదడు”. శుక్రుడు అలాగే చేశాడు. కచుడు శుక్రగర్భం నుంచి బయటకు వస్తూనే గురువు గారిని బ్రతికించినాడు. ప్రణామము చేసి శుక్రుని వద్ద సెలవు తీసుకొని ఇంటికి బయలుదేరినాడు.
అప్పుడు దేవయాని తన ప్రేమను వ్యక్త పఱచి తనను వివాహమాడమని నిర్బంధించింది. అంతట కచుడు “సోదరీ! నీవు నా గురు పుత్రికవు. కావున నాకు చెల్లెలివి అవుతావు. నీకిట్టి అధర్మ కోరిక కలుగరాదు” అని హితవు చెప్పాడు. నిరాకరించిన కచునిపై క్రోధిత అయి దేవయాని కచుని ఇలా శపించినది “నన్ను హింసించిన ఫలముగా ఈ విద్య నీకు ఉపకరించదు పో”! దేవయాని అమాయకత్వాన్ని చూసి ఇలా సమాధానమిచ్చాడు కచుడు
“చెల్లీ! విద్య ఎన్నడూ నిరుపయోగం కాదమ్మా! ఈ విద్య నాకు ఉపకరించక పోతేనేమి? అర్హులైన పరులకు నేర్పి వారికి ఉపయోగపడతాను. సమాజశ్రేయస్సుకై నా విద్య ఉపకరించుట కన్న నాకేమి కావాలి”? అని చెప్పి ఆనందముగా తిరిగి వెళిపోయాడు కచుడు.
పిల్లలూ! మనమీ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాము:
- దేశంకోసం ఒక గ్రామాన్ని, గ్రామం మేలుకై ఒక కుటుంబాన్ని, కుటుంబ శ్రేయస్సుకై ఒక కుటుంబ సభ్యుని త్యజించుట ధర్మము. ఈ సూక్ష్మం ఎఱిగిన బృహస్పతి తన ప్రియ కుమారుని ప్రాణాలను సైతం లెక్కసేయక దేవతలను కాపాడటానికి కచుని రాక్షస గురువు వద్దకు పంపించాడు.
- శత్రువని తెలిసి కూడా అర్హుడైన వాడు కాబట్టి కచునికి సంతోషముగా విద్యనేర్పించి ఆదర్శ గురువైనాడు శుక్రుడు. కచుడు శ్రద్ధాభక్తులతో విద్యలను అభ్యసించాడు. దేవయాని పట్ల ప్రవరాఖ్య నిగ్రహం చూపించి ఉత్తమ శిష్యుడైనాడు కచుడు. కావున మనకు ఈ శుక్రకచులు ఆదర్శప్రాయులు కావాలి.
- ఈర్ష అనేది పెనుభూతము. మత్సరముచే దారుణముగా కచుని చంపివేసినారు రాక్షసులు. అట్లు చేసి కచునికి సంజీవనీ మంత్రోపదేశం కలుగుటకు చేచేతులారా వారే కారణమైతిరి. వివేకహీనులు తెలియకనే వారికి వారే కీడు కలిగించుకొనెదరు.
- మదిరాపానము మహాపాపము (శంఖలిఖితుల కథ చూడండి). ఈ విషయమును మరొక్కమాఱు మనకు తెలియజేశాడు శుక్రుడు.
- గురుపుత్రిక సోదరి అని గ్రహించి దేవయానిని సోదరీభావముతో చూసిన కచుని ధర్మజ్ఞత మనకు కనువిప్పు కావాలి.
- చోరులచే చోరింపబడనిది అర్హులకు పంచి ఇస్తే పెరిగేదీ విద్యాధనమొక్కటే. విద్య యొక్క గొప్పతనము మనకు కచుని అమృతవాక్కుల ద్వారా ఈ కథలో తెలిసినది. మనమెప్పుడూ సమాజశ్రేయస్సునకే విద్యను ఉపయోగించాలి. విద్యాభ్యాసమునకు సార్థకత అప్పుడే కలుగును.
Search Terms: Kacha, Kaca, Shukra, Sukra, Shukraachaarya, Devayani, Devayaani.
5:38 అపరాహ్నం వద్ద మార్చి 5, 2008
The moral is very good.
Thanks to neethikathalu.
12:35 అపరాహ్నం వద్ద జనవరి 21, 2009
THIS STORY TELLS US ABOUT SACRIFISE . REALLY HELPS TO THIS MORAL. KACHA WAS A GOOD,BRIGHT&SINCEOR STUDENT. IN THIS CHARACTER WE LEARN LOT OF MORAL….SUPPOSE EVERY ONE THINK LOOK LIKE KACHA …”OUR COUNTRY WILL DEVELOP SUPER POWER”.IN THE MODERN PERIOD CHILDREN DOESN’T READ MORAL STORIES…ESPECIALLY ENGLISH MEDIUM ..TOWN BACKGROUND STUDENTS…
NARESH KUMAR . THURPINTI RESEARCH SCHOLAR, APIIIT
nareshrgukt23@gmail.com