శ్రీకాళిదాసకృత రఘువంశం లోని కథ
రఘువంశపు రాజైన దిలీపునికి చాలా కాలం వరకూ సంతానం కలుగలేదు. తన అర్థాంగి అయిన సుదక్షిణాదేవితో సహా సద్గురు దర్శనం కోసం వసిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. తనకుగల చింతను వ్యక్తపఱచాడు. ఒక్క నిమిషము ధ్యానముచేసి వసిష్ఠుల వారు ఇలా అన్నారు “నాయనా! నీవు ఒకసారి దేవేంద్రలోకం వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు కల్పవృక్ష ఛాయలో ఉన్న కామధేనువును గమనించలేదు. గోవు కనబడగానే నమస్కరించి ప్రదక్షిణము చేయాలి. ఇక కామధేనువు మాట వేరే చెప్పాలా? సర్వధర్మాలు తెలిసిన నీవు అప్పుడు ఋతుస్నాత అయిన నీ భార్య దగ్గర ఉండాలన్న ధర్మము పాటించే తొందరలో వేగముగా నీ మందిరము చేరదామని వస్తున్నావు. ఆ కారణముగా నీవు ఆ కామధేనువును గమనించకే వచ్చేశావు. నీచే పూజ్యపూజావ్యతిక్రమము జరిగినది. పూజ్యులను గుర్తింపక పోవుట శ్రేయస్సుకు భంగకరము కదా!
అప్పుడు కామధేనువు “రాజా! నన్ను పూజించకనే తొందరలో ఉండి వెళ్ళిపోతున్నావు. నా సంతానామును సేవించిన కానీ నీకు సంతానం కలుగదు” అని చెప్పినది. కానీ రథవేగము వలని వాయుధ్వని కారణముగా నీకుగానీ నీ సారథికిగానీ ఆ కామధేనువు చెప్పిన మాటలు వినబడలేదు. నాయనా! తెలిసిచేసినా తెలియకచేసినా కర్మఫలం అనుభవించక తప్పదు. చేసిన తప్పును సరిదిద్దుకుని ప్రగితిపథంలో నడిచేవాడు ఉత్తముడు. కావున నీవు గోసేవ చేసి శ్రేయస్సును పొందు. వరుణుని యజ్ఞములో పాలు నేయి ధనధాన్యాలు సమకూర్చుటకై కామధేనువు పాతాళలోకానికి వెళ్ళినది. ఆ గోమాత తరిగి వచ్చేంత వరకూ ఆమె సంతానమైన ఈ నందినీధేనువును సేవించి తరించు”.
ఇలా వసిష్ఠులవారు హితవు చెప్తుండగానే ఆ నందినీధేనువు రానేవచ్చింది. దిలీపుడు పరమసాధ్వి అయిన సుదక్షిణాదేవీ ఆ నందినీధేనువును సేవించుట ప్రారంభించారు. ఆ రాజదంపతులు నందినీధేనువును నీడలాగా అనుసరించి సేవించారు. ఆ ధేనువు నిలిచిన నిలిచి కూర్చున్న కూర్చుని నీళ్ళు త్రాగిన త్రాగి ఆ నందినీధేనువును ఆరాధించారు. ఇలా 21 దివసములు ఆ రాజదంపతులు ధేనువ్రతమును పరమభక్తితో చేశారు. వారి సేవకు సంతోషించిన నందినీధేనువు వారి భక్తిని పరీక్షిద్దామని హిమాలయములో ఒక గంభీర బిలంలోకి ప్రవేశించింది. త్రుటిలో ఒక సింహం ఆ హోమధేనువు మీద పడబోయింది. వెంటనే రాజు ఆ ధేనువును కాపాడటానికి ధనుర్బాణాలు తీయబోయాడు. కానీ ఆశ్చర్యం! చిత్రపటంలో వీరునిలాగా ఉండిపోయాడు. ఆ సింహము మాయ వలన స్థాణువుగా ఉండిపోయాడు. ప్రగల్భముగా అప్పుడు సింహమన్నది “రాజా! గిరిజాపతి ఆజ్ఞపొంది నేనీ పరిసరాలలో విహరిస్తున్నాను. శివ కింకరుడను. నా మీద నీ శక్తులేమీ పనిచేయవు. నేను మామూలు సింహాన్ని కాను. ప్రతిదినము పరమేశ్వరుడు నందిని ఆరోహించేటప్పుడు నన్ను పాదపీఠికగా నియోగించి అనుగ్రహిస్తాడు. నేను నికుంభ మిత్రుడనైన కుంభోదరుడను. పార్వతీదేవికి పుత్రప్రాయమైన ఈ దేవదారు వృక్షాన్ని కాపాడటానికి పరమశివుడు నన్నిక్కడ నియంమించాడు. ఈ ప్రాంతాలకి వచ్చే ఏ మృగాన్నైనా భక్షించే అధికారం నాకు ఉన్నది”.
“నా పరాక్రమం బాహుబలం వృథా అవుతున్నవే! ఈ నందినీ ధేనువును కాపాడలేక పోతున్నానే” అని అనుకుంటున్న రాజు “నేను కుంభోదరుడను. శివ కింకరుడను” అన్న మాటలు వినగానే కొంచెం కుదుటపడ్డాడు. “భగవత్ శక్తి ముందు మానవశక్తి అత్యల్పమే కదా!” అని అనుకున్నాడు. ఆ కుంభోదరునితో ఇలా అన్నాడు “ఓ దివ్య సింహమా! సృష్టి స్థితి లయ కారకుడైన ఆ పరమేశ్వరుడు నీకువలె నాకుకూడా పరమ పూజ్యుడు. కానీ హోమధేనువైన ఈ నందినిని కాపాడటము ధర్మమే కదా! మన ఇద్దరికీ శ్రేయోదాయకమైనది చెప్తాను. నా ఈ శరీరాన్ని ఆహారముగా స్వీకరించి నా గురుధనమైన ఈ నందినీధేనువును వడిచిపెట్టు”.
ఇది వినగానే కుంభోదరుడు నవ్వి “ఓ రాజా! నీవు చాలా మూఢుని వలెనున్నావు. నీవు ఈ భూమండలానికి ఏకఛత్రాధిపతివి. యవ్వనములో ఉన్న మన్మథాకారుడవు. ఒక్క గోవు కోసం అన్నీ వదులుకుంటావా? అల్పకారణానికి అధికమూల్యం ఎందుకు చెల్లిస్తావు? ఈ ఆవు కాకపోతే ఇలాంటివి కోటి మీ గురువు గారికి ఇవ్వచ్చు. నీ పాలనలో సుఖంగా ఉండే కోట్లాది ప్రజలను అనాథలను చేసి ఈ గోవు కోసం శరీర త్యాగముచేస్తావా? నీకు ఎట్టి అపకీర్తి రాదు. గురుద్రోహం అంటదు” అని అన్నాడు దిలీపుని ప్రలోభపెడదామని. అది విని ధర్మాత్ముడైన దిలీపుడు “క్షతము (ఆపద) నుండి రక్షించేవాడే క్షత్రియుడు. అట్లు చేయనివాడు రాజు ఎట్లా అవుతాడు? అదీ కాక ఎదుఱుగా హింస జరుతున్నా కాపాడకుండా చూస్తూన్న ప్రాణాలు ఎందుకు? ఓ శివ కింకరుడా! నీవు దేవతామూర్తివి. నా శరీరము స్వీకరించి ఈ ధేనువును విడిచి నా ప్రార్థన మన్నించు” అని అన్నాడు.
ఎట్లాగో చివరికి ఒప్పుకున్నది సింహం. స్థాణువుగా ఉన్న రాజు మామూలుగా కదలగడిగాడు. తనును తాను సింహానికి అర్పిద్దామని మోకాళ్ళ పై కూర్చుని తలవంచుకుని సింహం వేటుకై ఎదుఱు చూస్తున్న దిలీపుడి మీద పుష్పవృష్టి కురిసింది! నందినీధేనువు దివ్యాకృతి దాల్చి “రాజా! వసిష్ఠ మహర్షి తపశ్శక్తి వలన నన్ను ఈ సింహమే కాదు విశ్వంలో ఏ శక్తీ హానికలిగించలేదు. నిన్ను పరీక్షిద్దామనే ఇలా చేశాను. నీ భక్తితో నన్ను మెప్పించావు. దివ్యమైన నా క్షీరము స్వీకరించు. సంతానవంతుడివి అవుతావు” అని అన్నది నందినీధేనువు.
అప్పుడు ధర్మజ్ఞుడైన దిలీపుడిలా అన్నాడు “తల్లీ! నీ కరుణ అమోఘం. నన్ను నా అర్థాంగిని ధన్యుల్ని చేశావు. లేగ దూడ నీ పాలకై ఎదుఱు చూస్తుంది. మహర్షులు యజ్ఞార్థము నీ క్షీరమునకై నిరీక్షిస్తూ ఉంటారు. వారు తీసుకున్న తరువాత మిగిలిన దానిలో ఆఱోవంతు తీసుకుంటాను (ధర్మాత్ముడైన రాజు ప్రజలనుండి 1/6 మాత్రమే కప్పముగా తీసుకుంటాడు)”. “తథేతి” అని ఆశీర్వదించింది నందినీ. ధేనువ్రత మహిమ వలన రఘు మహారాజును పుత్రునిగా పొందినాడు దిలీపుడు.
పిల్లలూ! ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దామ్:
- పూజ్యులను ఎల్లవేళలా యథావిధిగా పూజించాలి. తొందరలో ఉండి కామధేనువును గమనించకుండా వెళ్ళిపోవుట వలనే దిలీపునికి శ్రేయస్సు ఆగిపోయింది. కావున పెద్దలను సాధు సజ్జనులను గోవులను ఎల్లప్పుడూ గౌరవించడం మన విధి.
- ఆపదలో ఉన్న గోమాతను కాపాడటానికి తన ప్రాణాలను సైంత ఇద్దామనుకున్న దిలీపుడు ఉత్తముడు. అతని గురుభక్తి ధేనువ్రత దీక్ష అసామాన్యాలు.
- “దూడ త్రాగిన తరువాత మహర్షులు తీసుకున్న తరువాత పాలుతీసుకుంటాను” అని అన్నప్పుడు దిలీపుని మహోన్నత వ్యక్తిత్వం మనకు తెలిసినది. 1/6 మాత్రమే తీసుకుంటాను అన్నప్పుడు ఆ రాజు యొక్క ధర్మబుద్ధి మనకు అవగతమైనది. ఇట్టి ధర్మాత్ములే మనకు ఆదర్శపురుషులు.
Search Terms: Dilipa, Dileepa, Diliipa, Sudakshina, Vasishtha, Nandinii, Nandini, Kamadhenu, Kaamadhenu

2:29 అపరాహ్నం వద్ద నవంబరు 29, 2007
super
6:00 అపరాహ్నం వద్ద మార్చి 5, 2008
very good.
9:52 పూర్వాహ్నం వద్ద ఆగష్టు 5, 2008
ee katha chaala bagunnadi. elaanti neeti kathalu pillalaku bodhinmclaslina avasaram emtyna vundi
7:32 పూర్వాహ్నం వద్ద అక్టోబర్ 1, 2009
In this world whatever we share, it will come to us in multiples. In Telugu there is a saying i.e, “PANCHUKO–PENCHUKO. Mothers should tell and explain these stores to their lads when they are about to sleep during the night times. So, that they will imbibe in their tiny minds and become part and parcel of their sub-conscious mind, thereby we are preparing a good citizen for the future generations to come, from now onwards. Really very nice and practical interpretations are given. Thank you very much..